ప్రపంచం అవతల నుంచి పెళ్లి గిఫ్ట్‌

27 Dec, 2020 11:33 IST|Sakshi

చంద్రుడి మీద మూడెకరాలు బహుమతి

జైపూర్‌: పెళ్లి కుదిరితే చాలు.. అమ్మాయిలు, అబ్బాయిలు బోలెడు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరిమీద ఒకరు ఎనలేని ప్రేమ చూపించుకుంటారు. పెళ్లైన కొత్తలో అయితే భార్యను విహార యాత్రలకు, సినిమాలకు, షాపింగ్‌లకు తీసుకెళ్తూ మా ఆయన బంగారం అనిపించుకునేందుకు తెగ తాపత్రయ పడతారు. కానీ రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు అయ్యే కొద్దీ పరిస్థితులు తలకిందులుగా మారుతుంటాయి. ఇల్లాలు ఏదైనా కావాలని నోరు తెరిచి అడిగితే భర్త ఒంటికాలిపై లేస్తారు. గిఫ్టులు కాదు కదా కనీసం ఓ మంచి చీర కూడా కొనివ్వడానికి ఆసక్తి చూపరు. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చాడు. (చదవండి: ఇలా ప్రపోజ్‌ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే)

రాజస్థాన్‌లోని అజ్మర్‌ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనీజాకు భార్య అంటే చెప్పలేనంత ప్రేమ. వారి ఎనిమదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సాప్నా అనీజాకు ఏదైనా స్పెషల్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా చంద్రమండలంలో మూడు ఎకరాలను కొనేసి ఆమెకు బహుమతిగా ఇవ్వడంతో ఆమె సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ గిఫ్ట్‌ గురించి ధర్మేంద్ర మాట్లాడుతూ.. 'డిసెంబర్‌ 24న మా పెళ్లి రోజు. అందరిలా కార్లు, నగలు కాకుండా నా భార్యకు ఏదైనా స్పెషల్‌ బహుమతి ఇద్దామనుకున్నా. అలా చంద్రుడి మీద ప్లాట్‌ కొనిచ్చాను. బహుశా చంద్రమండలం మీద స్థలాన్ని కొన్న మొదటి రాజస్థాన్‌ వ్యక్తిని నేనే అనుకుంటా' అని చెప్పుకొచ్చాడు. 'ప్రపంచం అవతల నుంచి బహుమతి అందుకున్నందుకు సంతోషంగా ఉంది. కొనుగోలు సర్టిఫికెట్‌ చూస్తుంటే నాకిప్పుడు చంద్రుడి మీదే ఉన్నట్లుగా అనిపిస్తోంది' అని అతని భార్య సాప్నా ఆనందంతో గాల్లో తేలుతోంది. అమెరికాలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌ కంపెనీ ద్వారా అనీజా.. చందమామ మీద స్థలాన్ని కొనుగోలు చేశాడు. (చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..)

మరిన్ని వార్తలు