రాజకీయ ఎంట్రీపై రజనీ పునరాలోచన!

29 Oct, 2020 14:20 IST|Sakshi

చెన్నై : రాజకీయ రంగప్రవేశంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పునరాలోచనలో పడినట్టు సంకేతాలు పంపారు. సరైన సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టడంపై తన వైఖరి వెల్లడిస్తానని ఆయన బుధవారం పేర్కొన్నారు. తాను రాసినట్టు చెబుతున్న బహిర్గతమైన లేఖపై రజనీ వివరణ ఇచ్చారు. ఈ లేఖ తాను రాయలేదని..అయితే తన ఆరోగ్యం, డాక్టర్ల సూచనలు మాత్రం నిజమేనని ఓ ప్రకటనలో తెలిపారు. తాను రజనీ మక్కల్‌ మండ్రమ్‌తో చర్చించి రాజకీయ వైఖరిపై సరైన సమయంలో ప్రకటన చేస్తానని రజనీకాంత్‌ స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ఎంట్రీ ఖాయమని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు కొద్దిముందు ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కరోనా వైరస్‌ వ్యాప్తితో తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రణాళికలు దెబ్బతిన్నాయని రజనీ రాసినట్టు చెబుతున్న లేఖపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నందున కోవిడ్‌-19 సోకే ప్రమాదం ఉందని సమూహాల్లో కలువరాదని వైద్యులు ఆయనకు సూచించినట్టు ఈ లేఖలో ప్రస్తావించారు. తన చుట్టూ ఉన్న వారి బాగోగుల కంటే తన గురించి తాను ఎక్కువగా విచారించబోనని ఈ లేఖలో రజనీ పేర్కొనట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావాలనే కోరికతో తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఈ ఏడాది మార్చిలో రజనీ తేల్చిచెప్పారు. చదవండి : రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్‌‌

మరిన్ని వార్తలు