సినిమాను మించే ట్విస్ట్‌లు.. రాజీవ్‌ హత్యకేసు లాంటిది భారతచరిత్రలో మరొకటి లేదేమో!

12 Nov, 2022 20:50 IST|Sakshi

నరకం, అవును నిజంగా నరకమే. చేసిన పాపం వెంటాడుతుంటే.. కటకటాల వెనక దశాబ్దాల పాటు ఉంటుంటే.. రేపు అనేది ఏమవుతుందో తెలియకపోతే.. నిజంగా నరకమే. 1991లో అప్పటి సమీకరణాల దృష్ట్యా రాజీవ్‌ను మట్టుపెట్టిన ఎల్టీటీఈ గ్యాంగులో మెజార్టీ దోషులు సెనైడ్‌ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన కొందరు ఏళ్ల కొద్ది జైల్లో ఉన్నారు. వీరికి ఉరి శిక్ష తృటిలో తప్పినా.. యావజ్జీవం మాత్రం వెంటాడింది. మెజార్టీ తమిళులు మద్దతివ్వడంతో బయటకు వస్తామన్న ఆశలు పెరిగి చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితి కలిగింది. అసలు నాడేమీ జరిగింది.? జైలు పక్షుల సమగ్ర కథనం ఇది..

ఒక నాయకుడు... ఒక నిర్ణయం... ఒక హత్య, తెర వెనక కొన్ని వందలమంది, అరెస్టయింది 26 మంది... శిక్ష పడింది ఏడుగురికి, ఉరి శిక్ష మాత్రం నలుగురికి. సినిమాను మించిన ఎన్నో ట్విస్టులను ఒక్కబిగిన చూపించే ఇలాంటి కేసు బహుశా భారతదేశ చరిత్రలో మరొకటి ఉండదేమో. 1991లో రాజీవ్‌ హత్య జరిగింది. ఆ కేసు చాలా మలుపులు తిరిగింది. ఎంతో మందిని ఈ కేసులో అరెస్ట్‌ చేసినా.. చివరికి దోషులుగా తేలింది 26మంది. అయితే వీరిలోనూ నేరుగా ప్రమేయమున్న వాళ్ల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. దాదాపు ఐదేళ్ల పాటు సిట్‌ విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టులోనూ సుదీర్ఘంగా కేసు నడిచింది. 1999లో ఏడుగురికి మరణశిక్ష పడింది. ఇక తమ జీవితం ముగిసిందనుకున్నారు దోషులు. రాజీవ్‌ను చంపిన పాపానికి నేడో, రేపో ఉరి తీయడం ఖాయమనుకున్నారు. అయితే ఎక్కడో ఆశ మిగిలింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. కేసు మరికొంత కాలం సాగింది. ఈలోగా తమిళనాడులో సీను మారింది. రాజీవ్‌ను హత్య చేయడం సరే కానీ, అరెస్టయిన వాళ్లు అమాయకులు, కేవలం ఓ ఆపరేషన్‌లో భాగమయ్యారన్న ప్రచారం తమిళనాడంతా పాకింది. దీంతో దేశంలో ఎప్పుడూ లేనట్టుగా నేరస్థులపై సానుభూతి వెల్లువెత్తింది.

1999లో నలుగురికి మరణశిక్షను నిర్దారించింది సుప్రీం. అయితే తమిళనాడులో పరిస్థితి మాత్రం మారింది. దోషులకు అనుకూలంగా రాజకీయ పార్టీలు, ప్రముఖులు, ఒకరేంటీ తమిళనాట జనమంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఇటు కేంద్రంలో పరిస్థితి మారింది. కాంగ్రెస్‌ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈలోగా కేంద్రంలో బలమైన ప్రభుత్వాలు లేకపోవడం, తమిళనాడులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒక పార్టీ అటు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం రావడంతో శిక్ష అమలులో జాప్యం జరిగింది. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా.. అనధికారికంగా నాన్చివేత ధోరణిని ప్రదర్శించారు ఢిల్లీ పెద్దలు. ఈ లోగా 2006లో మరో బాంబు పేల్చింది ఎల్టీటీఈ.

2006లో రాజీవ్‌ హత్య వెనక అసలు కారణాలను బహిరంగంగా ప్రపంచానికి వెల్లడించింది ఎల్టీటీఈ. తమ పట్ల శాంతి దళాలు అమానుషంగా ప్రవర్తించాయని, అసలు భారత దళాలను రాజీవ్‌ పంపడం వల్లే తాము కక్ష పెంచుకున్నామని తెలిపాడు ప్రభాకరన్‌. నిజానికి 1990లలో ప్రభాకరన్‌ ఢిల్లీకి వచ్చినట్టు చెబుతారు. అప్పట్లో కొందరు తమిళ నేతలు, ఎల్టీటీఈ లీడర్లతో కలిసి ఢిల్లీ వచ్చిన ప్రభాకరన్‌.. నేరుగా రాజీవ్‌ను కలిసినట్టు చెబుతారు. ఈ చర్చల్లో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకపోవడంతో ఎల్టీటీఈ నుంచి ఇక సమస్య ఉండదనుకున్నారు రాజీవ్‌. రాజీవ్‌ చేసిన ప్రతిపాదనను ఢిల్లీలో అంగీకరించిన ప్రభాకరన్‌.. జాఫ్నా వెళ్లిన తర్వాత మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు తమిళ వర్గాల సమాచారం. ఈ విషయంలోనే రాజీవ్‌కు కాసింత ఆగ్రహం వచ్చిందట. దీన్నే ఆసరాగా తీసుకుని అప్పట్లో ఇంటలిజెన్స్‌ అధికారులు కొందరు శాంతి దళాలు పంపే విషయంలో రాజీవ్‌తో అంగీకారం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాల బోగట్టా. నిజానికి ఆ సమయంలో ప్రధాని ఎవరున్నా.. నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నది సీనియర్‌ అధికారులు ఎవరయినా చెబుతారు. 

ఎవరూ ఊహించనివిధంగా పెరంబూదూర్‌లో హత్యకు స్కెచ్‌ వేసిన ఎల్టీటీఈ పకడ్బందీగా దాన్ని నిర్వహించింది. ఆ తర్వాత అంతే వేగంగా సిట్‌ అధికారులు హత్య కేసును చేధించారు. 2006లో ఈ విషయన్నాంతా వెల్లడించిన ఎల్టీటీఈ.. తప్పు చేశాడు కాబట్టే శిక్షించాం అన్న రీతిలో వ్యవహరించింది. ఎల్టీటీఈ ప్రకటనతో జైల్లో ఉన్న ఖైదీల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో యూపీఏలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎప్పటికప్పుడు ఉరి విషయానికి బ్రేకులు వేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కథ మరో మలుపు తిరిగింది.

(రాజీవ్‌ హత్యకేసుకు సంబంధిత కథనాల కోసం కింద లింక్స్‌ క్లిక్‌ చేయండి)

(Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్‌ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!)

(రాజీవ్‌ గాంధీ హత్యకు ఇంత ప్లాన్‌ చేశారా.. గంధపు దండ వల్లే దారుణం!)

(ఇందిర చేసిన తప్పే రాజీవ్‌ను బలి తీసుకుందా?)

మరిన్ని వార్తలు