చైనా కుతంత్రానికి దీటుగా బదులిచ్చిన భారత బలగాలు: రాజ్‌నాథ్‌

13 Dec, 2022 12:28 IST|Sakshi

న్యూఢిల్లీ: తవాంగ్‌ సెక్టార్‌ ఘటనపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ప్రకటన చేశారు. చైనా ఆర్మీ మన భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిందని, చైనా కుత్రంతానికి భారత బలగాలు దీటుగా బదులిచ్చాయని స్పష్టం చేశారు. భారత పోస్టును ఆక్రమించేందుకు చైనా జవాన్లు యత్నించినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో భారత బలగాలు స్పందించటంతో పీఎల్‌ఏ సైన్యం తోకముడుచుకుని తిరిగి వారి పోస్టులోకి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.  భారత సైనికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదన్నారు. 

‘డిసెంబర్‌ 9న తవాంగ్‌ సెక్టార్‌లో పీఎల్‌ఏ బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించాయి. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. వారిని వెనక్కి వెళ్లేలా చేశాయి. ఈ అంశాన్ని దౌత్యపరమైన విధానంలో చైనా ముందుకు తీసుకెళ్తాం. మన సరిహద్దులను కాపాడేందుకు, ఎలాంటి సంఘటనలు ఎదురైనా తిప్పికొట్టేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇస్తున్నాం. ఈ ఘర్షణలో ఇరువైపుల కొద్ది మంది సైనికులు గాయపడ్డారు. మన సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, తీవ్రంగా గాయపడలేదు. మన బలగాలు సరైన సమయంలో స్పందించటంతో పీఎల్‌ఏ సైనికులు తిరిగి వారి వారి ప్రాంతానికి వెళ్లిపోయారు.’

- రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. 

తవాంగ్ ఘర్షణ తర్వాత డిసెంబర్‌ 11న స్థానిక కమాండర్‌ చైనా కమాండర్‌తో ఫ్లాగ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారని తెలిపారు రాజ్‌నాథ్‌. ఈ సందర్భంగా సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకే తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా కమాండ్‌ తెలిపినట్లు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: తవాంగ్‌ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్‌ జెట్స్‌ గస్తీ

మరిన్ని వార్తలు