తీర భద్రతకు ‘విగ్రహ’ 

27 Aug, 2021 04:16 IST|Sakshi
ఐసీజీఎస్‌ విగ్రహ నౌక

కోస్ట్‌గార్డ్‌ అమ్ములపొదిలో ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెసల్‌ 

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నౌక 

రేపు జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

విశాఖ కేంద్రంగా విధుల్లో విగ్రహ నౌక 

సాక్షి, విశాఖపట్నం: భారత తీరగస్తీదళం అమ్ముల పొదిలో మరో అధునాతన నౌక చేరుతోంది. అడ్వాన్స్‌డ్‌ ఫైర్‌ పవర్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్‌ విగ్రహ నౌకను శనివారం చెన్నైలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెసల్‌ సిరీస్‌లో ఏడో నౌక అయిన విగ్రహని చెన్నైలోని ఎల్‌ అండ్‌ టీ షిప్‌ బిల్డింగ్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మించింది. ఈ నౌక కోస్ట్‌గార్డు ఈస్ట్రన్‌ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు నిర్వర్తించనుంది. ఐసీజీఎస్‌ విగ్రహ చేరడం ద్వారా కోస్ట్‌గార్డ్‌ జాబితాలో నౌకల సంఖ్య 157కు చేరుతుంది. కోస్ట్‌గార్డ్‌కు 66 విమానాలున్నాయి. 

అధునాతన సాంకేతికత 
విగ్రహ నౌకలో అధునాతన సాంకేతిక వసతులున్నాయి. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్‌తో ఉంది. దీని బరువు 2,200 టన్నులు. 9,100 కిలోవాట్స్‌ డీజిల్‌ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లున్నాయి. 26 నాటికల్‌ మైళ్ల వేగంతో 5 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్‌ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశను మార్చుకునే యంత్ర సామర్థ్యం దీని సొంతం. 40/60 బోఫోర్స్‌ గన్, ఫైర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో 12.7 మిల్లీమీటర్ల స్టెబిలైజ్డ్‌ రిమోట్‌ కంట్రోల్‌ గన్‌లు రెండు ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్‌ ఇంజిన్‌ హెలికాప్టర్, నాలుగు హైస్పీడ్‌ బోట్లు తీసుకెళ్లగలదు. సముద్రంలో చమురుతెట్టు వంటి కాలుష్యాల నియంత్రణకు స్పందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకలో ఉంది.   

మరిన్ని వార్తలు