రాజ్యసభలో అదే తీరు

2 Dec, 2021 05:38 IST|Sakshi
గాంధీజీ విగ్రహం వద్ద నిరసన దృశ్యం

12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై చర్చించాలని విపక్షాల డిమాండ్‌

సభ పలుమార్లు వాయిదా

న్యూఢిల్లీ: 12 మంది ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రతిపక్షాలు గొంతెత్తుతూనే ఉన్నాయి. ఈ అంశంపై సభలో చర్చించాలని బుధవారం పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌ ఎంపీ ఖర్గేకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు. శాంతించాలని సభాపతి పదేపదే కోరినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా సభ పలుమార్లు వాయిదాపడి చివరకు గురువారానికి వాయిదాపడింది.

రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన 12 మంది ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సస్సెన్షన్‌ను రద్దు చేసే దాకా నిరసన కొనసాగిస్తామన్నారు. కాగా, దేశవ్యాప్తంగా అన్ని క్లినిక్‌లు, వైద్య సిబ్బంది కోసం నేషనల్‌ రిజిస్ట్రీ, రిజిస్ట్రేషన్‌ అథారిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ(రెగ్యులేషన్‌) బిల్లు–2020ను∙ఆరోగ్య మంత్రి మాండవీయ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ వాయిస్‌ ఓటుతో ఆమోదించింది. కాగా, పార్లమెంట్‌లో 59వ నంబర్‌ గదిలో బుధవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంప్యూటర్, కుర్చీ, టేబుల్‌కు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి.
 

మరిన్ని వార్తలు