కోవాగ్జిన్‌ వద్దు.. కోవిషీల్డ్‌ కావాలి

17 Jan, 2021 05:43 IST|Sakshi

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(ఆర్‌డీఏ) మెడికల్‌ సూపరింటెండెంట్‌ను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ పట్ల తమ వైద్యుల్లో కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయని పేర్కొంది. ఆర్‌ఎంఎల్‌లో కోవిషీల్డ్‌ కాకుండా కోవాగ్జిన్‌ మాత్రమే ఇవ్వనున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. కోవాగ్జిన్‌ విషయంలో అన్ని ట్రయల్స్‌ పూర్తి కాలేదని వెల్లడించింది. కోవిషీల్డ్‌ విషయంలో అన్ని స్థాయిల్లో ట్రయల్స్‌ పూర్తయ్యాయని గుర్తుచేసింది.

కోవాగ్జిన్‌తో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్టపరిహారం
కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన వారితో అంగీకార పత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. కోవాగ్జిన్‌ తీసుకున్న వారిలో వారం రోజుల్లోగా తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు పత్రంలో స్పష్టం చేశారు. ఇలాంటి వారిని ఆసుపత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వల్లనే దుష్భ్రభావాలు తలెత్తినట్లు తేలితే దాని తయారీదారు భారత్‌ బయోటెక్‌ నష్టపరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు