'అరుదైన జంతువును దగ్గర్నుంచి చూశాను'

11 Aug, 2020 13:46 IST|Sakshi

ముంబై :  సోషల్‌ మీడియాలో కొన్నిసార్లు మనం చూసే వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మనకు కనిపించని కొన్ని వింత జంతువులు, పక్షులను ఫోటోలను తీసి షేర్‌ చేయగానే వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుధా రామెన్‌ షేర్‌ చేసిన వీడియో ఈ కోవకు చెందిందే. స్వతహాగా దక్షిణ భారతంలో పశ్చిమ కనుమల్లో అత్యంత అరుదుగా కనిపించే మాట్రెన్‌ జాతికి చెందిన నీలగిరి పిల్లిని షేర్‌ చేశారు.

'మీరు అనుకున్నట్లు ఇది బ్లాక్‌ పాంథర్‌ కాదు.. అంతరించిపోతున్న జంతువుల్లో ఒకటిగా ఉన్న నీలగిరి పిల్లి. భారత్‌లో దక్షిణ భాగంలో ఉన్న పశ్చిమ కనుమల్లో నివసించే ఈ జంతువు అరుదుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంతువు అంతరించే దశలో ఉంది. ఇవాళ నా కంటికి ఇది చిక్కడంతో మీతో షేర్‌ చేసుకున్నా' అంటూ చెప్పుకొచ్చారు. అయితే చూడడానికి బ్లాక్‌ పాంథర్‌లా కనిపించే నీలగిరి పిల్లి మెడ కింది బాగం పసుపు, నలుపు రంగులో మిలితమై ఉంటుంది. నీలగిరి పిల్లి.. 2.1 కేజీల బరువు, 40-45 సెం.మీ పొడవు తోకతో ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జీవ జాతుల ప్రపంచ పరిరక్షణ స్థితిని అధ్యయనం చేసే ఐయుసిఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) రెడ్ లిస్ట్‌లో(ప్రమాదకర స్థితి) నీలగిరి పిల్లిని ఒకటిగా చేర్చారు.

మరిన్ని వార్తలు