వైరలవుతోన్న రతన్‌ టాటా ఫోటో

6 Jan, 2021 15:50 IST|Sakshi

అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఉద్యోగిని పరామర్శించిన రతన్‌ టాటా

ముంబై: టాటా గ్రూపు అంటేనే విలువలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించినప్పటికి వీసమెత్తు గర్వం కనపడదు. ఇక ఉద్యోగుల పట్ల టాటా సంస్థలు చూపే శ్రద్ధ గురించి అందులో పని చేసే వారిని అడిగితే తెలుస్తుంది. టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటా సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశం పట్ల, సమాజం పట్ల టాటా కుటుంబానికి ఎంతో ప్రేమ, బాధ్యత. ఇక ఏదైనా విపత్తు వచ్చిందంటే చాలు సాయం చేయడంలో టాటా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే గత నాలుగైదు రోజులుగా రతన్‌ టాటాకు సంబధించిన ఓ వార్త సోషల్‌ మీడియా తెగ వైరలవుతోంది. తమ కంపెనీలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగిని కలవడం కోసం రతన్‌ టాటా స్వయంగా ముంబై నుంచి పుణె వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. యోగేష్‌ దేశాయ్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో రతన్‌ టాటా సదరు ఉద్యోగి పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోని షేర్‌ చేశారు. (చదవండి: పరిగెత్తండిరా!.. శబ్ధం చేయకండయ్యా!!)

ఇక ‘రతన్‌ టాటా లివింగ్‌ లెజెండ్‌.. భారతదేశంలో ఉన్న అతి గొప్ప వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. తమ సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతన్నారని రతన్‌ టాటాకు తెలిసింది. దాంతో అతడిని పరామర్శించడానికి ముంబై నుంచి పుణె వెళ్లారు. ఆయన వెంట బౌన్సర్లు లేరు.. మీడియా హడావుడి లేదు. నమ్మకంగా పని చేసిన ఉద్యోగి పట్ల ఆయన చూపిన ఈ సానుభూతి ఎంతో గొప్పది. డబ్బు మాత్రమే జీవితం కాదని అందరు వ్యాపారవేత్తలు తెలుసుకోవాలి. గొప్ప మనిషిగా బతకడం అనేది ముఖ్యం. సర్‌ మీరు చేసిన ఈ పనికి గౌరవంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. లివింగ్‌ లెజెండ్‌ రతన్‌ టాటా.. అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు.

మరిన్ని వార్తలు