అరెస్ట్‌ చేయనంటేనే పోలీసుల ఎదుటకు వస్తాను: ట్విట్టర్‌ ఎండీ

6 Jul, 2021 16:57 IST|Sakshi

కర్ణాటక హైకోర్టుకు తెలిపిన ట్విటర్‌ ఇండియా ఎండీ

బెంగళూరు: తనను అరెస్ట్‌ చేయరని గ్యారంటీ ఇస్తే.. ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎదుటకు వస్తానని సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ ఇండియా ఎండీ మనీశ్‌ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. ఘజియాబాద్‌లో ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో వైరల్‌ కావడంతో మనిష్‌ మహేశ్వర్‌పై యూపీ ఘజియాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనిష్‌ మహేశ్వర్‌ ఈ నోటీసులకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా మనిష్‌ మహేశ్వర్‌ ‘‘వారు(యూపీ పోలీసులు) నాపై చేయి వేయబోమని కోర్టుకు అండర్‌టేకింగ్‌ ఇస్తే.. నేను వ్యక్తిగతంగా పోలీసులు ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు. ఇక ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్‌ ఎండీ మనీశ్‌కు ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతానని మనీశ్‌ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్‌ పోలీసులు నిరాకరించారు.
 

మరిన్ని వార్తలు