అగర్తలా: తిప్రాసా ప్రజల సమస్యలపై రాజ్యాంగబద్ధ పరిష్కారం కనుగొనేందుకు బీజేపీతో ముఖాముఖి చర్చలకు సిద్ధమని తిప్రా మోథా చీఫ్ ప్రద్యోత్ దేవ్ వర్మన్ చెప్పారు. తిప్రా మోథా డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం చేసిన ప్రకటనపై దేవ్ స్పందించారు.
‘ఆర్థికంగా, రాజకీయంగా, భాషాపరంగా మాకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటిపై గౌరవప్రదంగా చర్చలకు పిలిస్తే వెళ్తాం. స్థానిక ఆదివాసీల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి మేం సిద్ధం. అయితే, ఈ చర్చలు కేబినెట్ పోస్టు కోసమో, వ్యక్తిగత లబ్ధి కోసమో మాత్రం కాదు’ అని స్పష్టంచేశారు. ఇటీవలి ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తిప్రా మోథా మొత్తం 13 ఎస్టీ రిజర్వుడు స్థానాలనూ గెలుచుకుంది.