మానవ మృగాలకు విడుదల.. 7 ఏళ్ల తర్వాత కోర్టు చెప్పిన కారణం ఇదే! బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన

8 Nov, 2022 11:19 IST|Sakshi

పదేళ్ల కిందటినాటి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై.. యావత్‌ దేశం రగిలిపోతోంది. కళ్లలో యాసిడ్‌పోసి.. జనానాంగాల్లో సీసాలు జొప్పించి అతికిరాతంగా హత్య చేశారామెను. అలాంటి కేసులో మరణ శిక్ష పడ్డ ఖైదీలను నిర్దోషులుగా ప్రకటించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌ ఆఖరిరోజు ఇచ్చిన తీర్పుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. 

2012 చావ్లా గ్యాంగ్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసులో నేరారోపణలను ప్రాసిక్యూషన్‌ వారు నిరూపించని కారణంగానే.. మరణ శిక్ష పడ్డ ఆ ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. వారిని దోషులుగా నిర్ధారించే సమయంలో దిగువ న్యాయస్థానం సైతం పారదర్శకత లేకుండా వ్యవహరించిందని బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద వాళ్లను నిర్దోషులుగా ప్రకటించినట్లు వెల్లడించింది. 

ఏడేళ్లుగా సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగగా.. తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘ఇది మాకు పెద్ద ఎదురు దెబ్బ. న్యాయం జరుగుతుందనే ఇక్కడికి(సుప్రీం కోర్టు) వచ్చాం. న్యాయవ్యవస్థ మీద నమ్మకమే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. కానీ, అది నెరవేరలేదు. 

చట్టం ఇలాగే ఉంటే.. ఇంక న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఎవరికి ఉంటుంది?.. న్యాయం జరగకపోవడం వల్లే కదా ఇంకా ఇలాంటి నేరాలు పెరిగిపోతాయ్‌. మా బిడ్డకు న్యాయం జరుతుందని వచ్చాం. కానీ, మా గుండెలు బద్ధలయ్యాయి. ఇదేనా న్యాయమంటే?. పదకొండేళ్లపాటు పోరాడిన మాకు దక్కిన తీర్పు ఇదా? పోరాటంలో మేం ఓడినట్లేనా? అసలు మాకు బతకాలనే లేదు. కానీ, ఇన్నాళ్లు ఒపిక పట్టిన మేం.. వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదు. కచ్చితంగా పోరాడతాం.. ముందుకెళ్తాం అని పేర్కొన్నారు. 

ఇక కోర్టు తీర్పు కాపీని అందుకున్నాకే.. రివ్యూ పిటిషన్‌కు వెళ్తామని బాధితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టు తీర్పు మాకు ఆశ్చర్యం కలిగింది. ఏడేళ్ల తర్వాత.. అదీ నేను గట్టిగా అడిగిన తర్వాతే కోర్టు విచారణ ముందుకు కదిలింది. వారంలోపే.. అదీ సీజేఐ ఆఖరి రోజున ఇలాంటి తీర్పు వచ్చింది. ఈ కేసులో వెనక్కి వెళ్లం.. తీర్పుపై పునసమీక్షకు వెళ్తాం అని ఆమె పేర్కొన్నారు.     

అంతకు ముందు సీజేఐ నేతృత్వంలోని.. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. హేతుకమైన సందేహం లేకుండా అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అంతేకాదు.. కోర్టు విచారణ సమయంలోనూ లోపాలు స్పష్టంగా గమనించామని, 49 సాక్ష్యుల్లో పది మందిని విచారించలేదని ధర్మాసనం తెలిపింది. అంతేకాదు.. న్యాయస్థానాలు చట్టపరిధిలో ఉండాలే తప్ప.. బయటి నుంచి వచ్చే నైతిక ఒత్తిళ్లకు తలొగ్గకూడదనే అభిప్రాయం వెలుబుచ్చింది. 

ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. గురుగావ్‌లో పని చేసే 19 ఏళ్ల యువతిని..  2012 ఫిబ్రవరి 9వ తేదీన తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదన్న కారణంతో ముగ్గురు నిందితుల్లో ఒకడైన వ్యక్తి.. ఎత్తుకెళ్లి మూడు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశాడు. ఆపై మృగచేష్టలతో సామూహికంగా హత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల తర్వాత శవాన్ని హర్యానా శివారులో పడేసి వెళ్లిపోయారు. కుళ్లిపోయిన స్థితిలో దొరికిన ఆమె మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి.. షాకింగ్‌కు గురి చేసే విషయాలు బయటపెట్టారు వైద్యులు. ఆపై నిందితులు ముగ్గురిని అరెస్ట్‌ చేయగా.. 2014లో ఢిల్లీ కోర్టు, ఆపై హైకోర్టు కూడా ఈ మానవ మృగాలకు సంఘంలో తిరిగే హక్కు లేదంటూ మరణ శిక్ష విధించాయి. చివరికి.. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఆ ముగ్గురు నిర్దోషులుగా బయటకు రాబోతున్నారు!.

సంబంధిత వార్త: భావోద్వేగాలకు.. సెంటిమెంట్లకు చోటు లేదిక్కడ! 

మరిన్ని వార్తలు