52 మందిని వదులుకున్నారు.. ఎన్‌సీపీని వదలలేరా? ఉద్ధవ్‌ను ప్రశ్నించిన రెబల్‌ మంత్రి

30 Jun, 2022 14:30 IST|Sakshi

ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తన 52 మంది ఎమ్మెల్యేలను వదులుకున్నారని, అయితే ఎన్‌సీపీని మాత్రం వదలలేక పోతున్నారని శివసేన రెబెల్‌ మంత్రి గులాబ్‌రావ్‌ పాటిల్‌  అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు అవకాశవాదులు కాదని, వారు సీఎంను ఒప్పించలేని స్థితిలో పార్టీ కోసం, తమ నాయకుడి కోసం అన్నీ చేశారని పాటిల్‌ అన్నారు. శివసేనపై గత వారం సీనియర్‌ నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే ప్రారంభించిన తిరుగుబాటులో గులాబ్‌రావు పాటిల్‌ కూడా ఉన్నారు.

మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలో తమ పార్టీతో అధికారాన్ని పంచుకున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో సంబంధాలు తెంచుకోవాలని తిరుగుబాటు శాసనసభ్యులు ఉద్ధవ్‌ ఠాక్రేను కోరుతున్నారు. ‘ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని,  52 మంది ఎమ్మెల్యేలను విడిచిపెట్టాడు. కానీ శరద్‌ పవార్‌ను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు’ అని అసమ్మతి శిబిరం విడుదల చేసిన ప్రసంగంలో పాటిల్‌ తన తోటి రెబల్‌ శాసనసభ్యులతో అన్నారు. 
చదవండి: శివసేనకు వెన్నుపోటు పొడించింది ఆయనే!

మరిన్ని వార్తలు