ఢిల్లీలో లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు

13 Jun, 2021 13:28 IST|Sakshi

ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు మార్కెట్లు, మాల్స్‌ నిర్వహణకు అనుమతి

సాక్షి, ఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సడలింపు వివరాలను ప్రకటించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు మార్కెట్లు, మాల్స్‌ నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హోటళ్లు, బ్యాంకెట్‌ హాళ్లలో వివాహాలకు అనుమతి లేదని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్ల నిర్వహణకు అనుమతి ఇచ్చామన్నారు. ఢిల్లీ మెట్రో, బస్సుల్లో 50 శాతం సామర్థ్యంతో నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు..

ఆటోలు, ఈ-రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, స్పాలు, జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతి లేదని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. పార్క్‌లు, గార్డెన్లకు అనుమతి లేదు. ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చామని.. ప్రార్థనా మందిరాలు తెరిచినా భక్తులకు అనుమతి లేదని సీఎం పేర్కొన్నారు. ఇంటి వద్ద 20 మందితో వివాహాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు.

అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి. ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం గ్రూప్‌-ఏ సిబ్బందికి అనుమతి ఇచ్చామన్నారు. ప్రైవేట్‌ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి అనుమతి ఇవ్వడంతో పాటు అత్యవసర కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. వారంపాటు గమనించి తదుపరి చర్యలు చేపడతామని.. కరోనా కేసులు పెరిగితే ఆంక్షలు మరింత కఠినం చేస్తామని సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు.

చదవండి: అమ్మా.. కరోనా మాత, అపచారం తల్లీ!
పిల్లలపై... థర్డ్‌వేవ్‌ ప్రభావానికి ఆధారాల్లేవ్‌!

>
మరిన్ని వార్తలు