‘బిల్కిస్‌’ దోషుల విడుదలపై సుప్రీం కోర్టుకు మహిళా హక్కుల కార్యకర్తలు

23 Aug, 2022 13:06 IST|Sakshi

న్యూఢిల్లీ: బిల్కిస్‌ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను  విడుదల చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు. సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా తేలిన వారిని విడుదల చేయొద్దని పిటిషన్‌లో పేర్కొన్నారు.

బిల్కిస్‌ బానో కేసు దోషుల రెమిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లాల్‌, రాప్‌ రేఖ వర్మలు. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌, అపర్నా భట్‌. 14 మంది హత్య, గర్భిణీపై అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషులను విడుదల చేయటాన్ని సవాల్‌ చేసినట్లు కపిల్‌ సిబాల్‌ పేర్కొన్నారు. ఈ పిల్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అంతకు ముందు.. సుమారు 6వేల మంది హక్కుల కార్యకర్తలు, చరిత్రకారులు దోషుల విడుదలను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు.

ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్‌ ఆవేదన


 

మరిన్ని వార్తలు