హిజాబ్‌ ధరించడం ఆర్టికల్‌ 25 కిందకు రాదు: కర్ణాటక ప్రభుత్వం

23 Feb, 2022 09:07 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు: భారత్‌లో హిజాబ్‌ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే విద్యా సంస్థల్లో క్రమశిక్షణ పరంగా హిజాబ్‌పై కొన్ని రకాల పరిమితులున్నాయని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై విధించిన ఆంక్షల్ని సవాల్‌ చేస్తూ దాఖలైన విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని కర్ణాటక అడ్వకేట్‌ జనరల్‌ ప్రభులింగ్‌ నవద్గీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం హిజాబ్‌ ధరించే హక్కు ఉందన్న వాదన సరైంది కాదన్నారు. అయితే ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం హిజాబ్‌ ధరించే హక్కుని రాజ్యాంగం కల్పించిందన్నారు.
చదవండి: హిజాబ్‌ కాకున్నా చద్దర్‌తో అయినా కప్పుకోండి!

దీని ప్రకారం కొన్ని సంస్థల్లో సహేతుకమైన కారణాలతో హిజాబ్‌ ధరించకూడదని చెప్పే అధికారాలు ఉంటాయని తన వాదనల్ని వినిపించారు. ఫుల్‌ బెంచ్‌ ఈ వారంలో విచారణను పూర్తి చేయనుంది. హిజాబ్‌ పిటిషన్‌దారుల్లో ఒకరైన హజ్రా షిఫా అల్లరిమూకలు తన సోదరుడిపై దాడికి దిగారని, తమ ఆస్తుల్ని ధ్వంసం చేశారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే దాడులకు దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సంఘ్‌ పరివార్‌ పనేనని ఆమె ఆరోపించారు.
చదవండి: హిజాబ్‌ వివాదం: యువతికి చేదు అనుభవం

మరిన్ని వార్తలు