చికెన్‌ రోల్‌ లేదని.. హోటల్‌కు నిప్పు

14 Dec, 2022 07:27 IST|Sakshi

సాక్షి, బనశంకరి: చికెన్‌ రోల్‌ ఇవ్వలేదని హోటల్‌లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన బెంగళూరు హనుమంతనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి హనుమంతనగర కుమార్‌ హోటల్‌కు రౌడీషీటర్‌ దేవరాజ్, ఇద్దరు అనుచరులు వెళ్లారు. తినడానికి చికెన్‌రోల్‌ కావాలని సిబ్బందిని అడిగారు. సమయం ముగిసింది, హోటల్‌ మూసేస్తున్నాం, ఈ రోజు మెనులో చికెన్‌రోల్‌ లేదని వారు చెప్పారు. దీంతో దేవరాజ్, అతని అనుచరులు సిబ్బందితో గొడవకు దిగారు. మద్యం మత్తులో ఉన్న వారిని హోటల్‌ సిబ్బంది చితకబాది బయటికి గెంటేసి హోటల్‌ తలుపులు వేశారు.  

పెట్రోలు పోసి నిప్పు  
దేవరాజ్‌ అనుచరులు సమీప పెట్రోల్‌బంక్‌కు వెళ్లి రెండు లీటర్లు పెట్రోల్‌ తీసుకొచ్చి హోటల్‌ సిబ్బంది గది మీద పోసి నిప్పుపెట్టారు. మంటలు వ్యాపించగానే సిబ్బంది బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. తలుపు, కిటికీ కాలిపోయింది. హోటల్‌ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా దేవరాజ్, గణేశ్‌ అనే ఇద్దరిని అరెస్టు చేసి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

(చదవండి:  జికా వైరస్ కలకలం.. కర్ణాటకలో తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్‌)

మరిన్ని వార్తలు