సాక్షి, ముంబై: దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధికంగా మహారాష్ర్టలో కొత్తగా 24,886 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క మహారాష్ర్టలోనే మొత్తం కేసుల సంఖ్య 10,15,681కు చేరుకుంది. కొత్తగా 393 మంది మరణించగా, ఇప్పటివరకు 28,724 మంది కరోనా కారణంగా మరణించినట్లు రాష్ర్ట ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు 20వేలకు పైగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ లెక్కన ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులతో నాల్గవ స్థానంలో ఉన్న రష్యాను తొందర్లోనే దాటేసేలా ఉంది. ఇప్పటి వరకు రష్యాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,51, 874గా ఉంది. అంటే కరోనా కేసుల విషయంలో మహారాష్ర్ట రెండు, మూడు రోజుల్లో రష్యాను దాటేయనుంది. (భారత్: 46 లక్షలు దాటిన కరోనా కేసులు)
కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 14,308 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,15,023కు పెరిగింది. రికవరీ రేటు 70.4%గా ఉండగా, మరణాల రేటు 2.83%గా ఉంది. రాష్ర్టంలో ఇప్పటివరకు 50.72 లక్షలమందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరీక్షలు పెంచడంతో పాజిటివ్ కేసులు సైతం ఎక్కువగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. దేశ జీడీపీలో మహారాష్ర్ట వాట సుమారు 15 శాతం. భారత ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మన్ముందు చాలా కష్టమంటున్నారు ఆర్థిక నిపుణులు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలకు రైలు సేవలు పునఃప్రారంభమైనా, మహరాష్ర్టలో మాత్రం నిలిచిపోయాయి. ఇప్పటికే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ రైలు సేవలు ప్రారంభిస్తే సెకండ్ వేవ్ మొదలవుతుందని అంచనా. (400 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు)