‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా

20 Dec, 2022 14:34 IST|Sakshi

న్యూఢిల్లీ: కేం‍ద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు అధికార బీజేపీ పార్టీ సభ్యులు. అయితే, కాంగ్రెస్‌ అధ్యక్షుడు అందుకు నిరాకరించడంతో కొంతసేపు సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాహుల్‌ గాంధీ చేపడుతున్న ‘భారత్‌ జోడో యాత్ర’ను బీజేపీ నేతలు ‘భారత్‌ తోడో యాత్ర’గా పేర్కొనటంపై సోమవారం మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. దేశం కోసం కాంగ్రెస్‌ స్సాతంత్య్రాన్ని తీసుకొచ్చిందని, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ వంటి నేతలు దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ‘కనీసం మీ ఇంట్లోని శునకం అయినా దేశం కోసం చనిపోయిందా? అయినప్పటికీ వారు దేశభక్తులమని చెప్పుకుంటున్నారు. మేమేమైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. మంగళవారం పార్లమెంట్‌ మొదలవగానే.. ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు అధికార పార్టీ సభ్యులు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ డిమాండ్‌ చేశారు. అటు లోక్‌సభలోనూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. 

మనం చిన్నపిల్లలమా?
రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌. వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంట్‌ వెలుపల చేసినట్లు గుర్తు చేశారు. ‘దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు మనల్ని చూసి నవ్వుతున్నారు. సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చెడ్డపేరు తెస్తుంది. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతారు. కనీసం సభాపతి సూచనలను కూట పట్టించుకోవట్లేదు. ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నారు. మన్నం చిన్నపిల్లలమా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ దన్‌ఖడ్‌.

ఇదీ చదవండి: రాజ్యసభ ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి

>
మరిన్ని వార్తలు