జనవరి 1 నుంచి.. ఆ ఆరు దేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి: కేంద్రం

29 Dec, 2022 15:39 IST|Sakshi

ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్‌ల విజృంభణ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తు‍న్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. 

చైనాతో పాటు హాంకాంగ్‌, జపాన్‌, సౌత్‌ కొరియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు..  ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్‌లోడ్‌ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఈ ఆరు దేశాల్లో కేసులు వెల్లువలా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే.. రాబోయే 40 రోజుల్లో భారత్‌ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో విదేశాల నుంచి, ప్రత్యేకించి ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు తప్పనిసరి చేసింది కేంద్రం. 

మరోవైపు ప్రస్తుతం విజృంభణకు కారణమైన ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 వేరియెంట్‌ తీవ్రత తక్కువే కావడంతో భారత్‌లో మరో వేవ్‌ ఉండకపోవచ్చని, పేషెంట్లు ఆస్పత్రుల పాలుకావడం.. మరణాలు ఎక్కువగా సంభవించకపోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. కాకపోతే.. వైరస్‌ వ్యాప్తి త్వరగతిన ఉంటుందని భావిస్తోంది. మరోవైపు నిపుణులు చైనాలో మాదిరి తీవ్ర పరిస్థితులు భారత్‌లో నెలకొనకపోవచ్చని, అందుకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌, ప్రజల్లో రోగ నిరోధక కారణాలని చెబుతున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు