మోదీజీ వారిపై చర్యలు తీసుకోండి.. లేఖ రాసి సాధువు ఆత్మహత్యాయత్నం!

3 Oct, 2022 21:15 IST|Sakshi

బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకాల్లో అవినీతిని జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ సాధువు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇందులో భాగంగా తన చేతిని కత్తితో కోసుకున్నాడు. ఈ ఘటన యూపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నది ఘాట్‌​లో విమల్‌ కుమార్‌ అనే సాధువు తన చేతిని పదునైన ఆయుధంతో కోసుకున్నాడు. దీంతో, తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ క్రమంలో విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సాధువును ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

మరోవైపు.. సాధువును ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులు అతడి వద్ద నుంచి ఓ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సదరు లెటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఉండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఆ లేఖలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం సహా పలు పథకాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని సాధువు ఆవేదన వ్యక్తం చేశాడు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా, సాధువు వ్యాఖ్యలు ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇక, విమల్‌ కుమార్‌.. బీహార్‌లోని అరారియా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

మరిన్ని వార్తలు