సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరిస్తే డబ్బులు ఆఫర్ చేశాడు: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌..

15 Mar, 2023 13:05 IST|Sakshi

ముంబై: గతేడాది మేలో జరిగిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇది తమ పనేనంటు గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

అయితే సిద్ధూ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను చంపుతామని ఓ బెదిరింపు లేఖ ఆయనకు చేరింది. సిద్దూ మూసేవాలను చంపినట్లే నిన్నూ హత్య చేస్తాం అని అందులో ఉంది. లేఖపై పేరు లేకపోయినప్పటికీ  ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని అందరికీ అర్థమైంది. కొన్నేళ్ల క్రితమే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తానని ఇతడు బెదిరించడం తీవ్ర దుమారం రేపింది.

అయితే సల్మాన్‌ను చంపేందుకు రూ.4లక్షలు పెట్టి తుపాకీ కూడా కొన్నట్లు లారెన్స్ బిష్ణోయ్ చెప్పాడు. ఆయన తమ సమాజాన్ని అమమానించాడని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేదంటే సల్మాన్  తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అలాగే సల్మాన్‌ను బెదిరించినప్పుడు ఆయన తమకు భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశాడని, కానీ తాము తిరస్కరించామని తెలిపాడు. 

'సల్మాన్‌ ఖాన్‌పై మా సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఆమన మమ్మల్ని అవమానించాడు. అతనిపై ఓ కేసు కూడా ఉంది. కానీ ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నాకు ఎవరి సాయం అవసరం లేదు. సల్మాన్‌పై నాకు చిన్నప్పటి నుంచే కోపం ఉంది. ఆయన అహాన్ని అతి త్వరలో లేదా ఆ తర్వాత దెబ్బతీస్తా. ఆయన మా పవిత్ర దేవాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మా సమాజం క్షమిస్తే.. నేను ఏమీ అనను..' అని లారెన్స్ బిష్ణోయ్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ చెప్పాడు.


చదవండి: 'మేడం చాలా క్యూట్‌గా ఉన్నావ్‌..' అంటూ మహిళా పోలీస్‌ను వేధించిన ఆకతాయి..

మరిన్ని వార్తలు