దళితుడినే: సమీర్‌ వాంఖెడే

2 Nov, 2021 06:01 IST|Sakshi

న్యూఢిల్లీ: నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్‌(ఎన్‌సీఎస్సీ) చైర్‌పర్సన్‌ విజయ్‌ సాంప్లాను కలిశారు. తన కులాన్ని(దళిత) ధ్రువీకరించే పత్రాలను అందజేశారు. తాను ముమ్మాటికీ దళితుడినేనని పేర్కొన్నారు. ఎన్‌సీఎస్సీ కోరిన అన్ని పత్రాలను, సాక్ష్యాధారాలను అందజేశానని వాంఖెడే చెప్పారు. ముంబై తీరంలో క్రూయిజ్‌ నౌకలో పట్టుబడిన డ్రగ్స్‌ కేసును ఆయన దర్యాప్తు చేస్తున్నారు.

యూపీఎస్సీ పరీక్షలో నెగ్గి, ఎస్సీ కోటాలో ఉద్యోగం సంపాదించడానికి వాంఖెడే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేశాడని, ఆయన దళితుడు కాదని, జన్మతా.. ముస్లిం అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ ఆరోపిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ నుంచి రూ.25 కోట్లు లంచం డిమాండ్‌ చేశారంటూ సమీర్‌ వాంఖెడే సహా ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎన్సీబీ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు