డ్రగ్స్‌ కేసు: నటి రాగిణి, సంజనాపై చార్జిషీట్‌

17 Mar, 2021 09:15 IST|Sakshi
రాగిణి,  సంజన (ఫైల్‌) 

శాండల్‌వుడ్‌ మత్తు  కేసు..

రాగిణి, సంజన సహా 25 మందిపై సీసీబీ దాఖలు

రాగిణిపై తీవ్ర ఆరోపణలు

సాక్షి, బెంగళూరు : సంచలనాత్మక డ్రగ్స్‌ వాడకం– రవాణా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన శాండల్‌వుడ్‌ నటీమణులు రాగిణి ద్వివేది (30), సంజనా గల్రాని (31)తో పాటు 25 మందిపై సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ (సీసీబీ), కాటన్‌పేటే పోలీసులు మంగళవారం ఎన్‌డీపీఎస్‌ కోర్టులో చార్జిషీట్‌ సమర్పించారు. డ్రగ్స్‌ ముఠాలు, వాటి దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీల చార్జిషీట్‌లో సమాచారం పొందుపరిచారు.

180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇంకా పరారీలో ఉన్న వారిపేర్లు కూడా చార్జిషీట్‌లో ప్రస్తావించారు. డ్రగ్స్‌ కేసులో 2020 సెప్టెంబరు మొదటివారంలో రాగిణి, ఆ తరువాత కొన్నివారాలకు సంజనను అరెస్టు చేసి 3 నెలలకు పైగా జైల్లో ఉంచడం తెలిసిందే.  

రాగిణి మత్తు పార్టీలు ఇలా  
► 2019 మే 26 న నటి రాగిణి పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వద్ద గల హోటల్‌లో ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి పార్టీ నిర్వహించడం, ఎక్స్‌టసీ డ్రగ్‌ మాత్రల  సేవనంతో పాటు ఇతరులకూ సరఫరా చేసినట్లు చార్జిషీట్‌లో ప్రస్తావించారు. 
► 2020 జూలై 5 న యలహంక లెరోమా హోటల్‌లో పార్టీలో డ్రగ్స్‌ సేవించారు.  
► 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ముఖ్య నిందితుడు లూమ్‌పెపే సాంబాకు ఫోన్‌ చేసి డ్రగ్స్‌ కొనుగోలు చేశారు. నైజీరియా పర్యాటకుడు నుంచి రాగిణి  డ్రగ్స్‌ తీసుకుంది.  
► ఆమె ఇతర నిందితులకు వాట్సాప్‌ ద్వారా డ్రగ్స్‌ కావాలని అడిగారు. ఆమె ఐఫోన్‌ 11 ప్రోమ్యాక్స్‌ మొబైల్‌ఫోన్‌ను సోదా చేయగా కీలక సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు.  సంజన గురించీ పెద్దసంఖ్యలో అభియోగాలు ఉన్నాయి.  
► ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి డ్రగ్స్‌ డీల్‌ గురించి ఏమేం మాట్లాడారు అనేది ప్రస్తావించారు. 69వ పేజీలో 2018 డిసెంబర్‌ 8వ తేదీన నటి రాగిణికి వ్యతిరేకంగా రవిశంకర్‌ భార్య చేసిన చాటింగ్‌ను పొందుపరిచారు. 

మరిన్ని వార్తలు