నిజాయితీ చాటుకున్న పారిశుధ్య కార్మికుడు 

8 Jan, 2021 07:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై : బీసెంట్‌నగర్‌లో చెత్తకుండిలో పడి వున్న రూ.15వేల నగదును సొంతదారునికి అప్పగించి నిజాయితీ చాటుకున్న 181వ వార్డు పారిశుధ్య కార్మికుడిని కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు అభినందించారు. చెన్నై అడయారు మండలం 181వ వార్డు కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికుడు ఎన్‌.మూర్తి (48). ఇతను బ్యాటరీ వాహనంలో చెత్తను సేకరిస్తుంటాడు. గత మూడవ తేదీ శాంతినగర్‌ బీచ్‌రోడ్డులో ఇంటిఇంటికీ వెళ్లిచెత్తను సేకరిస్తుండగా ఓ పార్శిల్‌ కంటపడింది. దానిని విప్పి చూడగా అందులో రూ.15వేల నగదు ఉంది.

వెంటనే మూర్తి కార్పొరేషన్‌ పారిశుధ్య విభాగం వార్డు మేనేజర్‌ సెల్వంకు విషయం తెలిపాడు. సెల్వంతో కలిసి ఆ నగదును పార్శిల్‌ పడివేసిన ఇంటి యజమానికి అప్పగించారు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్‌ ఆరోగ్యశాఖ డిప్యూటీ కమిషనర్‌ దివ్యదర్శిని, ఉన్నతాధికారులు బుధవారం మూర్తిని పిలిపించి అభినందించి అతనికి రూ.5వేలు బహుమతిగా అందజేశారు.  మైలాపూర్‌ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నటరాజన్‌ గురువారం మూర్తిని అభినందించారు.

మరిన్ని వార్తలు