మాది అమీర్, కిరణ్‌ల సంబంధం వంటిది

6 Jul, 2021 00:20 IST|Sakshi

శివసేన, బీజేపీల స్నేహంపై ఎంపీ సంజయ్‌రావుత్‌  

ముంబై: శివసేన, బీజేపీలది అమీర్‌ఖాన్, కిరణ్‌ రావుల మధ్య సంబంధం వంటిదని ఎంపీ సంజయ్‌రావుత్‌ వ్యాఖ్యానించారు. ఇరుపార్టీల మధ్య స్నేహం ఉందని స్పష్టంచేశారు. 15 ఏళ్ల వివాహ బంధానికి చెక్‌ పెడుతూ విడాకులు తీసుకున్నట్లు ఇటీవలె అమీర్‌ దంపతులు ప్రకటించారు. ఇద్దరి మధ్య సంబంధం మారిపోయినా, ఇంకా కలిసే ఉన్నట్లు వారిద్దరూ ఓ ప్రకటనలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ, సేనలు శత్రువులు కాదని ఇటీవల మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్‌ రావుత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సోమవారం సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘అమీర్‌ ఖాన్, కిరణ్‌ రావులను చూడండి. (వారి) దారులు విడిపోయాయి. కానీ, వారు స్నేహితులు. ఇక్కడ కూడా అంతే. (మా) మార్గా  లు వేరు కానీ, స్నేహం అలాగే ఉంది. రాజకీయాల్లో స్నేహం ఉంటుంది. కానీ మేం (మహారాష్ట్రలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని దీని అర్థం కాదు. తేడాలు ఉన్నాయి, కానీ నేను చాలా కాలంగా చెబుతున్నట్లుగా, మేం (సేన, బీజేపీ) భారతదేశం–పాకిస్తాన్‌ కాదు. సమావేశాలు, చర్చలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్గాలు వేరయ్యాయి. రాజకీయాల్లో మా మార్గాలు విడిపోయాయి’’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు