-

‘మూడు రోజుల ప్రభుత్వానికి మొదటి వర్ధంతి’

24 Nov, 2020 13:44 IST|Sakshi

బీజేపీ సంజయ్‌ రౌత్‌ కామెంట్‌

ముంబై : మహారాష్ట్రలో ‘మూడు రోజుల బీజేపీ ప్రభుత్వం’ కుప్పకూలి నేటికి ఏడాది గడిచిందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ గుర్తుచేశారు. నేటితో మొదటి వర్ధంతి పూర్తిచేసుకుందని ఎద్దేవా చేశారు. గత ఏడాది నవంబర్‌ 23న మాజీ బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నాటకీయ పరిణామాల మధ్య ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఫడ్నవిస్‌కు మద్దతు పలికిన అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ఎన్నికైయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో మూడు రోజులకే ఫడ్నవిస్‌ రాజీనామా చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్‌ కేవలం 80 గంటల్లోనే రాజీనామా సమర్పించారు. చదవండి: ముంబై కార్పొరేషన్‌‌ ఎన్నికలకు ఎన్సీపీ సన్నద్దం?

దీనిపై సోమవారం సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తికాలం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం మరో నాలుగు ఏళ్లు విజయవంతంగా పాలన పూర్తి చేస్తుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు విఫలమవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని వారికి బాగా తెలుస్తోంది’ అని ఆయన అన్నారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి రావ్‌ సాహెబ్ ఇటీవల మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా ప్రస్తావిస్తూ.. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోతుందని, వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది జోస్యం చెప్పారు. చదవండి: 'పాక్‌, బంగ్లాదేశ్‌లను భారత్‌లో కలపాలి'

కాగా గత ఏడాది అనేక ఉత్కంఠ పరిణామాల నడుమ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపిన అజిత్‌ పవార్..‌ తిరగి ఎన్సీపీలోకి రావటంతో నవంబర్‌ 28న ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ డీప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. 2019లో హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు, ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్‌ 44 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: పవార్‌ వాఖ్యలను ఖండించిన యడియూరప్ప

మరిన్ని వార్తలు