‘ముంబైని కించపరిస్తే సహించం’

4 Sep, 2020 15:54 IST|Sakshi

కంగనా వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌ ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ క్వీన్‌, ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్‌ శివసేన నేత సంజయ్‌ రౌత్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముంబై పోలీసులపై విశ్వాసం లేకుంటే నగరంలోకి రావద్దని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తనను బెదిరించారని కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై శివసేన నేత స్పందించారు.‘ఆమె ఓ మెంటల్‌ కేసు..తను తినే పళ్లెంలోనే ఉమ్మేసే రకం.. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నా’యని రౌత్‌ వ్యాఖ్యానించారు. ‘మేం ఎవరినీ బెదిరించబోము...ముంబై నగరాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)తో పోల్చేవారికి పీఓకే గురించి ఏమీ తెలియదు..ముంబై, మహారాష్ట్రలను కించపరచడాన్ని తాము సహించ’మని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

26/11 దాడుల సమయంలో ముంబై పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పౌరులను కాపాడారని, 1992 ముంబై పేలుళ్లలోనూ నగరాన్ని, నగర ప్రజలను వారు కాపాడారని కొనియాడారు. కరోనా వైరస్‌తో పలువురు ముంబై పోలీసులు అధికారులు ప్రాణాలు కోల్పోయారని, రోగుల సేవలో పలు త్యాగాలు చేస్తున్నారని ప్రస్తుతించారు. కాగా సుశాంత్‌ మృతి కేసుకు సంబంధించి ముంబై పోలీసుల దర్యాప్తుపై కంగనా రనౌత్‌ ప్రశ్నలు లేవనెత్తడాన్ని ప్రస్తావిస్తూ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలపై కంగనా అభ్యంతరం తెలిపారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ముంబైలో అడుగుపెట్టరాదని సేన నేత తనను బెదిరించారని, ముంబైని చూస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా ఎందుకు కనిపిస్తోందని ఆమె ట్వీట్‌ చేశారు.

చదవండి : పీఓకేను తలపిస్తోన్న ముంబై

మరిన్ని వార్తలు