ఆప్‌ నాయకులకు పరువు నష్టం నోటీసులు... భయపడేదే లేదంటూ ముక్కలు ముక్కలుగా చించేసి...

7 Sep, 2022 14:32 IST|Sakshi

న్యూఢిల్లీ: మద్యంపాలసీకి సంబంధించిన స్కీంలో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పై సీబీఐ దాడుల జరిపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆప్‌ నాయకులు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనాతో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్‌ వర్సస్‌ ఎల్‌జీ(లెఫ్టినెంట్‌ గవర్నర్‌), స్కామ్‌ వర్సస్‌ స్కామ్‌ రాజకీయం అన్నట్లుగా ఇద్దరి మధ్య వాడి వేడిగా విమర్శలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖాదీ స్కాం విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా పై ఆప్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

దీంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్కేనా  ఆప్ నాయకులు సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్‌, అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ల తోపాటు జాస్మిన్ షాలకు పరువు నష్టానికి సంబంధించిన లీగల్‌ నోటీసులు పంపించారు. అంతేకాదు ఇలా పార్టీలోని సభ్యులందరూ ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగా దురుద్దేశపూర్వకంగా, నిరాధారమైన తప్పుడు ప్రకటనలతో తన పరువుకి భంగం కలిగేంచే వ్యాఖ్యలను వ్యాప్తి చేసే అలవాటును మానుకోవాలంటూ ఒక పత్రిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మేరకు ఆప్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ..."భారత రాజ్యంగం నాకు మాట్లాడే హక్కును ఇచ్చింది. అలాగే రాజ్యసభ సభ్యునిగా నిజం మాట్లాడే హక్కు నాకు ఉంది.

ఒక దొంగ, అవినీతిపరుడు పంపిన నోటీసులకు భయపడను అంటూ ముక్కలు ముక్కలుగా చించేశారు. అలాంటివి ఎన్ని నోటీసులు పంపించినా చించేయగలను, విసిరి పారేయగలను" అని ఆగ్రహించారు.  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తమపై ఇలా రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆప్‌ పేర్కొంది.

అంతేకాదు సక్కేనా 2015 నుంచి 2022 వరకు ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీన్‌ కమిషన్‌(కేవీఐసీ) చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడూ అనేక అవకతవకలు జరిగాయని ఆప్‌ ఆరోపించింది. పైగా ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ...కేవీఐసీ ఉద్యోగులపై సుమారు రూ. 1400 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారంటూ పలు ఆరోపణలు చేశారు.

అంతేకాదు మంబైలోని ఖాదీ లాంచ్‌ ఇంటీరీయర్‌ డిజైనింగ్‌ కాంట్రాక్టును కూడా తన కుమార్తెకు ఇచ్చారంటూ ఆరోపణలు గుప్పించారు. తాము చేస్తున్న పోరాటంలో పలు ప్రశ్నలు ఉంటాయని వాటిని ఎదర్కునేందుకు సిద్ధంగా ఉండండి అని సవాలు ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ సవాలు విసిరారు. సుప్రీం కోర్టు ఆప్‌ నేతలకు ఈ నోటీసులను బుధవారం పంపిచింది. ఈ కేసు విచారణను ధర్మాసనం అక్టోబర్‌ 11 వ తేదికి వాయిదా వేసింది. 

(చదవండి: 'బీజేపీలో ఉంటూనే ఆప్‌ కోసం పనిచేయండి'.. కార్యకర్తలకు కేజ్రీవాల్‌ పిలుపు)

మరిన్ని వార్తలు