ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శరద్‌ పవార్‌..?

13 Jun, 2022 19:40 IST|Sakshi

న్యూఢిల్లీ: జూలై 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ పోటీ చేస్తున్నారా? ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా? తాజా పరిణామాలు చూస్తే ఔననే చెబుతున్నాయి. ప్రతిపక్షాలలో ఎవరినోట చూసిన శరద్‌ పవార్‌ పేరే వినిపిస్తోంది. అదీగాక రాష్ట్రపతి పదవికి శరద్‌ పవార్‌ను నామినేట్‌ చేసేలా కాంగ్రెస్‌ పూర్తి మద్దతు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే శరద్‌ పవర్‌తో సమావేశమైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఐతే ఈ విషయమై ఎన్సీపీ నేత శరద్‌ పవర్‌ ఇంకా స్పందించలేదు.  పవార్‌తో ఆమ్‌ఆద్మీపార్టీ నేత సంజయ్‌ సింగ్‌ కూడా ఫోన్‌లో మాట్లాడారు . ఖర్గే ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే, తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తృణమాల్‌ అధినేత పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ ఖర్గే ఫోన్‌లో సంభాషించారు. పైగా రాష్ట్రపతి ఎన్నిక గురించి ఈ నెల 15న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటితో మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు.

దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన శరద్‌ పవార్‌ అనేక పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాలను నెలకొల్పడంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. మహారాష్ట్రలో సైద్ధాంతిక వైరుధ్యాలు కలిగిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీకి వ్యతిరేకంగా  సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు బీజేపీ అన్ని పార్టీలతో చర్చలు జరిపి రాష్ట్రపతి ఎన్నికను ఏకాభిప్రాయం చేసే దిశగా జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను రంగంలోకి దింపింది. 2017లో కూడా బీజేపీ ఏకాభిప్రాయం కోసం వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌ పేర్లను నామినేట్‌ చేసింది. ఐతే ఆ తర్వాత ఎన్డీయే తరుపున వెంకయ్య నాయుడుని బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. ఒకవేళ బీజేపీ ప్రతిపక్షాలతో ఏకాభ్రిప్రాయ చర్చలు ఫలించనట్లయితే రాష్ట్రపతి ఎన్నికకు సిద్ధం కానున్నట్లు సమాచారం.

(చదవండి: గవర్నర్‌ అధికారాల కోతలో దీదీ సక్సెస్‌.. బీజేపీ వ్యతిరేకత ఉన్నా 40 ఓట్లేనా?)

మరిన్ని వార్తలు