విజృంభిస్తోన్న వైరస్‌.. సత్యేంద్ర జైన్‌ స్పందన

3 Sep, 2020 16:15 IST|Sakshi

రెండు నెలల తర్వాత బుధవారం గరిష్టంగా 2,509 కేసులు నమోదు

న్యూఢిల్లీ: కాస్తా తెరపినిచ్చింది అనుకునేలోపే దేశ రాజధానిలో కరోనా మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా ఢిల్లీలో 2,509 కేసులు నమోదయ్యాయి. దాంతో రాజధానిలో వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దీన్ని సెకండ్‌ వేవ్‌ అనకూడదు. ఓ రెండు నెలల పాటు జీరో కేసులు నమోదయ్యి.. ఆ తర్వాత కొత్తగా కేసులు వెలుగు చూస్తే దానిని సెకండ్‌ వేవ్‌ అంటాం. ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాకపోతే కేసుల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి. దీని గురించి ఆందోళన చెందకూడదు’ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,79,569కి చేరింది. ఇక మరణాల సంఖ్య 4,481కి చేరింది. (చదవండి: క‌రోనా బారిన 'ద రాక్' కుటుంబం)

సత్యేంద్ర జైన్‌ మాట్లాడుతూ.. ‘ఇక బుధవారం నాడు మరణాల సంఖ్య 0.75శాతంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే 2.5శాతం మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం పరీక్షల సంఖ్యను పెంచుతున్నాము. ఒక్కరోజులోనే 30-35 వేల పరీక్షలు నిర్వహిస్తున్నాము’ అని తెలిపారు. ఇక ప్రజలు కూడా మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడంతో పాటు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సత్యేంద్ర జైన్‌ కోరారు. గత వారం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ప్రభుత్వం కోవిడ్ -19 పరీక్షలను 20,000 నుంచి 40,000 కు పెంచుతామని ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు