SBI Recruitment 2021: ఎస్‌బీఐలో.. సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌

20 Dec, 2021 09:03 IST|Sakshi

1,200కుపైగా పోస్ట్‌లకు ఎస్‌బీఐ నోటిఫికేషన్‌

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక

కొలువుదీరితే.. సుస్థిర భవిష్యత్తు ఖాయం

వేతన శ్రేణి: రూ.36,100–రూ.63,840 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. వేల సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థ! శాఖలను విస్తరిస్తూ.. సేవలను విస్తృతం చేస్తోంది. నిత్యం కొలువుల భర్తీ చేపడుతూ.. ఉద్యోగార్థులకు కేరాఫ్‌గా నిలుస్తోంది! తాజాగా.. మరో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌తో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా బ్యాంకు పరిధిలోని ఐదు సర్కిళ్లలో.. పన్నెండు వందలకు పైగా సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ నోటిఫికేషన్‌ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, విజయం సాధించేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. 

ప్రభుత్వ రంగ బ్యాంకులో కొలువు దక్కిం దంటే.. లైఫ్‌ సెటిల్‌ అయినట్లే! ఇక కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు. ఆకర్షణీయ వేతనం, ఉజ్వల భవిష్యత్‌ సొంతమవుతాయి. అందుకే బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం లక్షల మంది  ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితిల్లో బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. తాజాగా సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 1226
ప్రారంభ వేతన శ్రేణి: రూ.36,100–రూ.63,840
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: డిసెంబర్‌ 1, 2021 నాటికి ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం రెండేళ్ల ఉద్యోగ అనుభ వం తప్పనిసరి. నిబంధనల ప్రకారం డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ అనుభవం పొంది ఉండాలి.
వయసు: డిసెంబర్‌ 1, 2021 నాటికి 21–30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక ప్రక్రియ
ఎస్‌బీఐ సీబీఓ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. అవి.. రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ.

రాత పరీక్ష ఇలా
ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది  నాలుగు విభాగాల్లో మొత్తం 120 మార్కులకు జరుగుతుంది.  ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు– 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌/ఎకానమీ 30 ప్రశ్నలు–30 మార్కులు, కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలు–20 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ కూడా
రాత పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్‌ పరీక్ష ముగిసిన తర్వాత మరో 30 నిమిషాల వ్యవధిలో ఇంగ్లిష్‌ భాషపై 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష నిర్వహి స్తారు. ఈ డిస్క్రిప్టివ్‌ పరీక్షలో భాగంగా అభ్యర్థులు లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. 

స్క్రీనింగ్‌
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దరఖా స్తు, అనుభవం, ధ్రువపత్రాలను స్కీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుంది. సంస్థ కోరుకుంటున్న ఉద్యోగ అనుభవం అభ్యర్థికి ఉందని కమిటీ సంతృప్తి చెందితేనే పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తుంది. 

పర్సనల్‌ ఇంటర్వ్యూ
రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించా రు. అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న ఆసక్తి, సమకాలీన అంశాలపై అవగాహన, బ్యాంకింగ్‌ రంగంపై పరిజ్ఞానాన్ని పరిశీలించేవిధంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

తుది ఎంపిక
అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను వెయిటేజీ  ఆధారంగా క్రోడీకరించి.. తుది విజేతలను ప్రకటిస్తారు. రాత పరీక్షలో ప్రతిభకు 75 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంట ర్వ్యూలో పొందిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంటే..170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులను 75 శాతానికి.. 50 మార్కులకు జరిగే ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25 శాతానికి మదింపు చేస్తారు.ఆ తర్వాత తుది విజేతలను ఖరారు చేస్తారు.

లాంగ్వేజ్‌ టెస్ట్‌
సంబంధిత రాష్ట్రానికి చెందిన అధికారిక భాషపై లాంగ్వేజ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన భాష పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో విజయం సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే నియామకం ఖరారు చేస్తారు. పదో తరగతి, 12వ తరగతిని సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృ భాషలో చదివిన వారికి ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు కల్పిస్తారు.
 
కెరీర్‌ ఇలా
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి ముందుగా ఆరు నెలల ప్రొబేషన్‌ ఉంటుంది. ఈ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా శాశ్వత నియామకం ఖరారు చేస్తారు. ఇలా పూర్తిస్థాయి నియామకం ఖరారైన వారికి జూనియర్‌ మేనేజ్‌ మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌–1 హోదా కల్పిస్తారు. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకోవచ్చు. 

రాత పరీక్షలో రాణించాలంటే
ఎస్‌బీఐ సీబీఓ రాత పరీక్షలో విజయం సాధించాలంటే..అభ్యర్థులు మొదటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. ఆయా సబ్జెక్ట్‌లు, విభాగాల వారీగా దృష్టి సారించి.. ప్రిపరేషన్‌ కొనసాగించాలి. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగంలో స్కోర్‌ కోసం బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 

జనరల్‌ ఎవేర్‌నెస్‌/ఎకానమీ: ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా ఆర్థిక, వాణిజ్య, వ్యాపార పరిణామాలు, విధానాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో.. కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌తోపాటు ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకానమీకి సంబంధించి జీడీపీ మూల భావనలు, సమ్మిళిత వృద్ధి, మైక్రో, మాక్రో ఎకనామిక్స్‌ భావనలు తెలుసుకోవాలి. 

బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌: ఈ విభాగానికి సంబంధించి బ్యాంకింగ్‌ రంగంలో తాజా పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన చట్టాలు, విధానాలు, రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. 

కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌: ఈ విభాగానికి సంబంధించి కంప్యూటర్‌ ఆపరేషన్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలు, పదజాలంపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. కీ బోర్డ్‌ షాట్‌ కట్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్‌ డిస్క్‌ తదితర) గురించి తెలుసుకోవాలి. అదే విధంగా కంప్యూటర్‌ పదజాలం, బ్యాంకింగ్‌ రంగంలో వినియోగించే సాఫ్ట్‌వేర్‌ల గురించి అవగాహన పెంచుకోవాలి.  

ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో.. లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌లో రాణించడానికి బిజినెస్‌ లెటర్స్, అఫిషియల్‌ లెటర్స్, పర్సనల్‌ లెటర్స్‌ను రాయడం అలవర్చుకోవాలి. వీటిలో పంక్చుయేషన్స్‌ కూడా ముఖ్యమని గుర్తించాలి. ఎస్సే రైటింగ్‌కు సంబంధించి బ్యాంకింగ్‌ రంగ పరిణామాలకు ప్రాధాన్యమిస్తూ వ్యాసాలు రాయగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ దిన పత్రికల్లో ప్రచురించే బిజినెస్‌ న్యూస్, అనాలిసిస్‌లను అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది. వాటిని విశ్లేషించి సారాంశాన్ని గ్రహించి.. ఎస్సే రాయగలిగే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం: సీబీఓ అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్ష విజయంలో ప్రాక్టీస్‌ ఎంతో కీలకంగా నిలుస్తుంది. కాబట్టి పాత ప్రశ్న పత్రాలు, మోడల్‌ ప్రశ్న పత్రాల సాధనకు సమయం కేటాయించాలి. ప్రతి రోజు కనీసం 8 నుంచి పది గంటలు సమయం వెచ్చించే విధంగా టైం మేనేజ్‌మెంట్‌ చేసుకోవాలి.

ఎస్‌బీఐ సీబీఓ–ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.12.2021
కాల్‌ లెటర్‌: జనవరి 12, 2022 నుంచి
పరీక్ష తేదీ: జనవరి 2022లో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.
ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 2022 రెండో వారం/మూడో వారం
పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి/ఏప్రిల్‌
వెబ్‌సైట్‌: https://bank.sbi/careers

మరిన్ని వార్తలు