ఇదేం బాధ్యతారాహిత్యం

3 Sep, 2021 05:33 IST|Sakshi

సామాజిక మాధ్యమాలపై నియంత్రణ లేదా?

వార్తలకు మత రంగు.. దేశానికి చెడ్డపేరు

ఆందోళన వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి జవాబుదారీతనం లేకుండా కొన్ని సామాజిక మాధ్యమాలు, వెబ్‌ పోర్టళ్లలో నకిలీ వార్తల ప్రచారంపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గతేడాది కోవిడ్‌ వ్యాప్తికి నిజాముద్దీన్‌ మర్కజ్‌ కారణమంటూ కొన్ని ప్రింట్, ఎల్రక్టానిక్‌ మీడియాల్లో వచి్చన వార్తలకు వ్యతిరేకంగా జమియత్‌ ఉలేమా ఇ హింద్,  పీస్‌ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది.

పిటిషనర్‌ దాఖలు చేసిన సవరణ విజ్ఞప్తి పిటిషన్‌ను అనుమతించిన ధర్మాసనం ప్రతులను సొలిసిటర్‌ జనరల్‌కు అందజేయాలని పిటిషనర్‌ న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఫేస్‌బుక్, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాలపై సీజేఐ పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఫేస్‌బుక్, యూట్యూబ్‌ ఇతర సామాజిక మాధ్యమాలు మాకు కూడా స్పందించడం లేదు. వ్యక్తులనే కాదు సంస్థలపైనా ప్రచురణ విషయంలో బాధ్యతగా వ్యవహరించడం లేదు. వారు న్యాయమూర్తులు, సంస్థలు, వ్యక్తుల గురించి చింతించరు.. కానీ శక్తిమంతులైన వారు చెబితే వింటారు’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు.

‘యూట్యూబ్‌ చూస్తే తెలుస్తుంది అందులో ఎన్ని నకిలీ వార్తలు ఉంటాయో. వెబ్‌ పోర్టళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. దేశంలో ఓ వర్గం మీడియా ప్రతీదీ మతపరమైన కోణంలో చూపుతోంది. వార్తలకు మత రంగు పులమడం పెద్ద సమస్యగా మారింది. చివరికి ఇది దేశానికి చెడ్డపేరు తెస్తుంది. ఈ ప్రైవేట్‌ చానళ్లను నియంత్రించే చర్యలు ఎప్పుడూ కేంద్రం చేపట్టలేదా?’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లను నియంత్రించే యంత్రాంగం ఉంది. వెబ్‌పోర్టళ్లను నియంత్రించే యంత్రాంగం ఉండాలని కేంద్రానికి సూచించలేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మతపరంగానే కాదని వార్తలు కూడా సృష్టిస్తున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.

సోషల్, డిజిటల్‌ మీడియాను నూతన ఐటీ రూల్స్, 2021 నియంత్రిస్తాయని మెహతా తెలిపారు. ముస్లిం సంస్థల తరఫున హాజరైన న్యాయవాది సంజయ్‌ హెగ్డే సొలిసిటర్‌ జనరల్‌ వ్యాఖ్యలను సమర్థించారు. ఐటీ రూల్స్‌ను సవాల్‌ చేస్తూ వేర్వేరు హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని తుషార్‌ మెహతా కోరారు. వేర్వేరు హైకోర్టులు వేర్వేరుగా ఆదేశాలు ఇస్తున్నాయని, దేశం మొత్తానికి సంబంధించిన నేపథ్యంలో సమగ్రత కోసం పిటిషన్లు బదిలీ చేయాలన్నారు. కేంద్రం దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను ప్రస్తుత పిటిషన్‌తో కలిపి జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం ఆరు వారాలపాటు విచారణ వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు