అదానీ వ్యవహారం: మాకు సీల్డ్ కవర్ అక్కర్లేదు.. కేంద్రానికి సుప్రీం ఝలక్‌

17 Feb, 2023 16:14 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సీల్డ్‌ కవర్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అదానీ స్టాక్ పతనం తర్వాత ఇన్వెస్టర్ల సంపదను సంరక్షించేందుకు పటిష్ట యంత్రాంగం అవసరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. అయితే ప్యానెల్‌ వివరాలను కేంద్రం సీల్డ్‌ కవర్‌లో సమర్పించగా.. సుప్రీం దానిని తిరస్కరించింది. 

‘నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి’ ఏర్పాటు చేయబోయే ప్యానెల్‌ వివరాల ప్రతిపాదనలను ‘సీల్డ్’ కవర్‌లో ఇవ్వడం సరికాదు. మాకు సీల్డ్ కవర్ అక్కర్లేదు. మేము పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నాము. మేము ఈ సూచనలను అంగీకరిస్తే.. అది మేం కోరుకోని, ప్రభుత్వం నియమించిన కమిటీగా కనిపిస్తుంది. ఆ నిర్ణయం మాకే వదిలివేయండి అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కమిటీపై తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది.

కోట్లాది ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టి, విపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమైంది అదానీ స్టాక్స్‌ పతన వ్యవహారం. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఓ న్యాయమూర్తితో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు గత వారం కేంద్రాన్ని కోరింది.  ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్యానెల్‌ ఏర్పాటుకు కేంద్రం రెడీ అయ్యింది.

ఇక అదానీ వ్యవహారం కేసులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లు ఇలా ఉన్నాయి. అదానీ కంపెనీల అడిటింగ్‌ వివరాలతో పాటు బ్యాంక్‌ రుణాల ఇచ్చిన షేర్ల విలువ తెలియజేయాలని కోరారు. మరో పిటిషన్‌లో అడ్వొకేట్‌ ఎంఎల్‌ శర్మ.. హిండెన్‌బర్గ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ హిండెన్‌వర్గ్‌ నివేదికపై సుప్రీం కోర్టు ఆధారిత సిట్‌ను దర్యాప్తు కోసం ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక హిండెన్‌బర్గ్‌ నివేదికపై దర్యాప్తునకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్రం ఇదివరకే సుప్రీంకు తెలిపింది కూడా.

మరిన్ని వార్తలు