హిజాబ్‌‌ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు

29 Aug, 2022 14:43 IST|Sakshi

ఢిల్లీ: విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. కర్ణాటక ​ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. 

జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాన్షు ధూలియా నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు.. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందించాలని సర్కార్‌ను కోరింది. అదే సమయంలో పిటిషనర్లను సైతం మందలించింది ధర్మాసనం. 

ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని మీరే కోరారు. మళ్లీ వాయిదా అడిగారు. ఆపై మళ్లీ విచారణకు కోరారు. ఇప్పుడు మళ్లీ వాయిదా అడుగుతున్నారు. ఇలాంటి వాటికి ఇక్కడ అనుమతి లేదు.. వాదనలు వింటాం అని పేర్కొంటూ సెప్టెంబర్‌ 5వ తేదీన వాదనలు ఉంటాయని స్పష్టం చేసింది. 

యూనిఫాం నిబంధనలను విద్యాసంస్థల్లో కఠినంగా అమలు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి సూచిస్తూ.. హిజాబ్‌ ధారణకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తన తీర్పులో ఆదేశాలు వెల్లడించింది. దీంతో చాలామంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అధికారులను ప్రొత్సహిస్తూ.. ప్రభుత్వం సవతి ప్రేమను ప్రదర్శిస్తోందంటూ పలువురు పిటిషన్‌లలో పేర్కొన్నారు. హిజాబ్‌ దుమారం ఈ ఏడాది మొదట్లో.. ఉడిపి నుంచి మొదలై దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపెట్టింది.

ఇదీ చదవండి: ఆపరేషన్‌ కమలం విఫలమైందని చూపించేందుకే.. 

మరిన్ని వార్తలు