Umesh Pal kidnapping case: గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ని దోషిగా తేల్చిన కోర్టు.. జీవిత ఖైదు శిక్ష

28 Mar, 2023 16:40 IST|Sakshi

2006 ఉమేష్‌పాల్‌ కిడ్నాప్‌ కేసులో గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అతిక్‌తోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. 2006లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్‌ పాల్‌ కిడ్నాప్‌ కేసులో కీలక నిందితులుగా ఉన్న అతిక్‌, అతని సోదరుడిని నేడు ప్రయాగ్‌రాజ్‌ కోర్టు ముందు హజరు పరిచారు.

కాగా యూపీ పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఇది ఈ కోర్టు జోక్యం చేసుకునే కేసు కాదని తేల్చి చెప్పింది. దీనికోసం కావాలంటే హైకోర్టుని ఆశ్రయించమని చెప్పింది. ఈ మేరకు అతిక్‌ అహ్మద్‌, అతని సోదరుడిని భారీ భద్రత మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్‌ జైలుకు తీసుకువచ్చారు యూపీ పోలీసులు. భారీ బందోబస్తు నడుమ అతిక్‌ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టుకు తరలించారు.

ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు తానే సాక్షినని ఉమేష్‌పాల్‌​ పోలీసులను ఆశ్రయించాడు. 2006లో ఉమేష్‌ పాల్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోమంటూ అతిక్‌ ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉమేష్‌. ఐతే అతను కిడ్నాప్‌ కేసు విచారణ రోజే పట్టపగలే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఈ కేసు విషయమై అతిక్ అహ్మద్, అతని సోదరుడి తోసహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
(చదవండి: జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విధించండి)

మరిన్ని వార్తలు