రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికా?.. ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలం ఎందుకు పొడిగించారు?

13 Dec, 2022 06:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ మిశ్రా పదవీ కాలాన్ని మూడుసార్లు ఎందుకు పొడిగించారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రంతోపాటు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ), ఈడీ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది.

ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నేత జయా ఠాకూర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గావై, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రంతోపాటు సీవీసీకి నోటీసులు జారీ చేసింది.

రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటోందని, తద్వారా ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తోందని జయా ఠాకూర్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. సంజయ్‌కుమార్‌ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆక్షేపించారు.   

మరిన్ని వార్తలు