-

MP School Bus Video: డ్రైవర్‌ తప్పిదం.. వరదలో చిక్కుకున్న స్కూల్‌ బస్సు 24 మంది విద్యార్థులు..

24 Jul, 2022 09:33 IST|Sakshi

దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో, సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. గ్రామాలు, నగరాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో వాహన ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. 

అయితే, మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, షాజాపూర్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. శనివారం 24 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. రోడ్డు మీద వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా బస్సు డ్రైవర్‌ ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, స్కూల్‌ బస్సు వరదల్లో చిక్కుకుపోవడంతో విద్యార్థులు భయంతో కేకలు వేశారు. 

ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఓ ట్రాక్టర్‌ సాయంతో బస్సును వరదలో నుంచి బయటకు తీశారు. 24 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. పిల్లలందరూ క్షేమంగా బయటపడటంతో వారి పేరెంట్స్‌ ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: చేపకు వేలంలో రూ. 3 లక్షలు.. స్పెషల్‌ తెలిస్తే షాక్‌ అవుతారు

మరిన్ని వార్తలు