సొంత బ్యాంకుకే సెక్యురిటీ గార్డు కన్నం

23 Aug, 2020 14:52 IST|Sakshi

చండీగఢ్‌: సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకు ఉద్యోగులను బెదిరించి రూ. 10 లక్షల 44 వేలు లూటీ చేశాడు. అయితే, పోలీసులు సత్వరం స్పందించి నిందితున్ని 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ ఘటన హరియాణాలోని మొహాలీ జిల్లాలో జరిగింది. పార్చ్‌ గ్రామంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో బల్జీత్‌ సింగ్‌ సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, క్యాషియర్‌ పని నిమిత్తం బటయకు వెళ్లారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు, మందులు తీసుకొస్తానని బల్జీత్‌ సింగ్‌ కూడా బయటకు వెళ్లాడు. 

బ్రాంచ్‌లో మేనేజర్‌ అమన్‌ గగ్నేజా, ఒక ప్యూన్‌ మాత్రమే మిగిలారు. అంతలోనే మాస్క్‌  ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో లోనికి ప్రవేశించి వారిద్దరినీ బెదిరించి క్యాష్‌ బాక్స్‌తో పరార్‌ అయ్యాడు. బ్రాంచ్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తమదైన రీతిలో ప్రశ్నించడంతో బల్జీత్‌ సింగ్‌ నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి నగదుతోపాటు ఓ నాటు తుపాకీ, ఐదు తుపాకీ గుళ్ల కార్ట్రిజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
(చదవండి: విషాద ఘటనలో ఒంటరైన ‘కూవి’, దాంతో)

మరిన్ని వార్తలు