రోగిని బురదలో ఈడ్చుకెళ్లిన సెక్యూరిటీ గార్డ్‌

20 Feb, 2021 20:27 IST|Sakshi

భోపాల్‌: అనారోగ్యంతో ఆస్పత్రికి రాగా సెక్యూరిటీ గార్డ్‌ అమానుషంగా వ్యహరించాడు. బురద నీటిలో ఈడ్చుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు. ఈ ఘోరమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నా అనేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌కాగా.. ఆ సెక్యూరిటీ గార్డుపై దుమ్మెత్తిపోస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌ ఖర్గోన్‌ జిల్లాలోని ప్రధాన ఆస్పత్రికి మానసిక పరిస్థితి సక్రమంగా లేని మహిళ వచ్చింది. చికిత్స చేయమంటూ వైద్యులను అడిగింది. అయితే ఆమె తన వివరాలు సక్రమంగా చెప్పకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వైద్యం చేయడానికి నిరాకరించారు. ఆమె ఎంత బతిమాలినా వినకపోవడంతో ఆమె గేట్‌ బయటకు వచ్చి కూర్చుంది. అయితే ఆమెను బయటకు వెళ్లాలని అక్కడున్న సెక్యూరిటీ గార్డు చెప్పాడు. ఆమె వెళ్లకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఆమె చేతిని పట్టుకుని లాక్కుంటూ బయటకు తీసుకెళ్లాడు. అక్కడ బురద ఉన్నా కూడా అలాగే తీసుకెళ్తున్న ఘటనను అక్కడున్న వాళ్లు ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు ఇప్పుడు అతడి తీరుపై ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తీవ్ర విమర్శలు రావడంతో ఆస్పత్రి అధికారులు ఆ సెక్యూరిటీ గార్డును సస్పెండ్‌ చేశారని సమాచారం.
 

మరిన్ని వార్తలు