రాజద్రోహంపై సుప్రీం ఆదేశం: లక్ష్మణ రేఖను గౌరవించాలి.. దాటకూడదన్న కేంద్ర మంత్రి

11 May, 2022 14:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన రాజద్రోహ చట్టం విషయంలో ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సమీక్షలు పూర్తయ్యేదాకా రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయాలంటూ కేంద్రానికి చెప్పింది. అంతేకాదు కొత్త కేసులు.. అరెస్టులు నమోదు చేయొద్దని చెబుతూనే.. ఇప్పటికే రాజద్రోహం కింద అరెస్టయిన వాళ్లు బెయిల్‌ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని స్పష్టం చేసింది. 

ఈ పరిణామంపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు Kiren Rijiju కోర్టు ఆదేశాలపై.. ‘కోర్టులకు ఉన్న స్వతంత్ర్య హోదాను, వాటిని తీర్పును గౌరవిస్తామని అన్నారు. అంతేకాదు లక్ష్మణ రేఖను దాటకూడదు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ చట్టం విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. మా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏంటో కూడా న్యాయస్థానానికి తెలియజేశాం. న్యాయస్థానాలను, వాటి స్వతంత్ర్య హోదాను మేం గౌరవిస్తాం. కానీ, అంతా లక్ష్మణ రేఖను గౌరవించాలి. అంతేగానీ దాటకూడదు కదా అంటూ మంత్రి కిరెన్‌ రిజిజు మీడియాతో మాట్లాడారు.

బ్రిటిష్‌ కాలంలో భారతీయుల అణచివేతకు కారణమైన ఐపీసీ సెక్షన్ 124-ఏను.. ఇప్పటికీ అమలు చేస్తుండడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తంకాగా, కేంద్రం మాత్రం ఈ సెక్షన్‌పై దోబుచులాడుతూ వస్తోంది. తాజాగా ఈ సెక్షన్‌ సవరణ సమీక్షకు తాము సిద్ధమంటూ అఫిడవిట్‌లో పేర్కొనడం.. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో రాజద్రోహం సెక్షన్‌కు ఇప్పుడు బ్రేకు పడింది.

చదవండి: ‘రాజద్రోహం చట్టం’పై స్టే విధించిన సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు