రూ. 287 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ పట్టివేత

12 Nov, 2020 15:01 IST|Sakshi

ఇంఫాల్‌ : మణిపూర్‌లోని థౌబల్‌ జిల్లాలో భద్రతా దళాలు రూ. 287 కోట్లు విలువ చేసే 72 కిలోల బ్రౌన్‌ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కాము ప్రాంతంలో అస్పాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులు కలిసి చేసిన దాడుల్లో ఈ మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను దేశంలోని పలు ప్రాంతాల​కు రవాణా చేస్తున్నారని నిఘా వర్గాల పక్కా సమాచారంతో కొన్ని బృందాలుగా ఏర్పడి గత రెండురోజులగా కూంబింగ్‌ నిర్వహించాయి. అందులో ఒక బృందం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిపిన దాడుల్లో మూడు సంచుల బ్రౌన్‌ షుగర్‌ను పట్టుకుంది. వీటి విలువ దాదాపు రూ. 287 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

 అంతకుముందు గత నెలలో మోజింగ్‌ అవాంగ్‌ లెకాయి ప్రాంతంలో 438.945 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను, 438 లీటర్ల మార్ఫినేటేడ్‌ ద్రావణం, ఇతర పదార్థాలను పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 22న లిలాంగ్‌ ప్రాంతంలో పోలీసులు అక్రమ డ్రగ్స్‌ ఫ్యాక్టరీని ఛేదించి రూ. 164 కోట్లు విలువ చేసే 41 కిలోల బ్రౌన్‌ షుగర్‌ని స్వాధీనం చేశారు. తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వాహానాలను పరిశీలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు