గురుభ్యోనమః.. నిరుపేద విద్యార్థుల కోసం షూ పాలీష్‌ చేస్తున్న ప్రొఫెసర్‌

30 Sep, 2022 12:31 IST|Sakshi
షూ పాలీష్‌ చేస్తున్న ప్రొఫెసర్‌ సెల్వకుమార్‌  

తిరువళ్లూరు (చెన్నై): పేద, నిరాశ్రయ విద్యార్థుల చదువు కోసం నిధుల సేకరణలో భాగంగా తమిళ ప్రొఫెసర్‌ సెల్వకుమార్‌ పళవేర్కాడులో చెప్పులు, షూలకు పాలీష్‌ చేసి నిధులను సేకరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పాడియనల్లూరుకు చెందిన ప్రొఫెసర్‌ సెల్వకుమార్‌.

అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కళాశాలలో తమిళ్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. 2004లో మదర్‌ థెరిసా పాఠశాలను ఏర్పాటు చేసి 19 ఏళ్లుగా పేద, అనాథ విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో పాఠశాల నిర్వాహణ కష్టంగా మారడంతో వినూత్న రీతిలో నిధులను సేకరిస్తున్నాడు. కళాశాలకు సెలవు ఉన్న సమయంలో ప్రముఖ ప్రాంతాలకు వెళ్లి.. నేను మీ చెప్పులను తుడుస్తా. మీరు నావద్ద ఉన్న పిల్లల కన్నీటిని తుడవాలని కోరుతున్నారు.

జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెప్పులు తుడవడం, షూలకు పాలీష్‌ చేసి తద్వారా వచ్చే నిధులను పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నాడు. ఇతడి ప్రయాణం ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో సాగింది. తాజాగా తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని కామరాజర్, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం చెప్పులు తుడవడం, షూలకు పాలీష్‌ చేసి నిధులను సేకరించారు. కోటైకుప్పం పంచాయతీ అధ్యక్షుడు సంపత్, మీంజూరు ధామోదరన్, పళవేర్కాడు సంజయ్‌గాంధీ సాయం అందించారు.    

మరిన్ని వార్తలు