ఆ అభ్యర్థనలు ఆమోదయోగ్యం కాదు.. నేను అనుమతించను: ఎన్వీ రమణ

11 Aug, 2022 10:44 IST|Sakshi

న్యూఢిల్లీ: తమ కేసులను అత్యవసర విచారణకు తీసుకోవాలంటూ సీనియర్‌ న్యాయవాదులు చేస్తున్న అభ్యర్థనలు ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్పష్టంచేశారు. ‘సీనియర్‌ లాయర్లు ఇలా మెన్షన్‌ చేయడాన్ని నేను అనుమతించబోను. సుప్రీంకోర్టు పనిదినం ప్రారంభంకాగానే తమ కేసులే ముందుగా విచారణకు చేపట్టాలంటూ పలువురు సీనియర్‌ లాయర్ల నుంచి వినతులు ఎక్కువయ్యాయి. వారి వినతులకు ప్రాధాన్యత ఇవ్వబోను’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.

అర్జెంట్‌ లిస్టింగ్‌(కేసుల విచారణ జాబితా)లో తమ కేసును జతచేయాలంటూ ఒక సీనియర్‌ వకీలు..  సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ రమణల ధర్మాసనం ముందు క్యూలో నిల్చొని అభ్యర్థిస్తుండగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ మరుసటి రోజు మెన్షన్‌ చేయండని మీ ఏఓఆర్‌(అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌)కు చెప్పండి’ అంటూ సీజేఐ సూచించారు. కేసులను మెన్షన్‌ చేసేందుకు సీనియర్‌ లాయర్లయిన కపిల్‌ సిబల్, ఏఎం సింఘ్వీలనూ సీజేఐ అనుమతించలేదు.

చదవండి: (గుడ్‌న్యూస్‌: 2024 డిసెంబర్‌ 31 దాకా ‘పీఎంఏవై–అర్బన్‌’)

మరిన్ని వార్తలు