మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్‌ కేసు విచారణకు కేంద్రం ఆమోదం..

22 Feb, 2023 09:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్ తలిగింది. స్నూపింగ్ కేసులో  ఆయనపై న్యాయపమరైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని లెఫ్టినెంట్‌ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా.. ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం పంపారు. ఈ విజ్ఞప్తికి హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా.. ఇప్పుడు స్నూపింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చాక ఫీడ్‌బ్యాక్ యూనిట్‌(ఎఫ్‌బీయూ)ను ఏర్పాటు చేసింది. 2016లో రూ.కోటి కేటాయించడంతో ఎఫ్‌బీయూ సీక్రెట్ సర్వీస్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలపై రహస్య నిఘా పెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఏర్పాటు చేశారంటోంది. ఢిల్లీ విజిలెన్స్ శాఖకు నేతృత్వం వహిస్తున్న సిసోడియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కావాలని కోరింది. 

2015లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎఫ్‌బీయూ ఏర్పాటును సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారని, కానీ దాని ఎజెండాకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సీబీఐ ఆరోపిస్తోంది. ఎఫ్‌బీయూ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా లేదని పేర్కొంది.

సీబీఐ అభ్యర్థను ఆమోదిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎటువంటి శాసన, న్యాయ, కార్యనిర్వాహక పర్యవేక్షణ లేకుండా అధికారాన్ని ఉపయోగించి రహస్య ఏజెన్సీని స్థాపించేందుకు ఆప్ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు.
చదవండి: దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత?

మరిన్ని వార్తలు