Amarnath Yatra Road Accident: అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి!

14 Jul, 2022 14:51 IST|Sakshi

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్‌ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ  సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని బద్రాగుండ్‌ క్రాసింగ్‌ వద్ద టిప్పర్‌ డంపర్‌ ఢీకోట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు.  

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్‌నాథ్‌ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ఆ వరదల్లో సుమారు 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. అమరనాథ్‌ యాత్రకు భగవతి నగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి గురువారం 5వేల మంది యాత్రికులు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ‘నున్వాన్‌-పహల్గామ్‌, బాల్టాల్‌ బేస్‌ క్యాంపుల నుంచి 201 వాహనాల్లో మొత్తం 5,449 మంది యాత్రికులు బయలుదేరారు. ’ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. 

జున్‌ 29న భగవతి నగర్‌ బేస్‌ క్యాంప్‌లో అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించారు గవర్నర్‌. అప్పటి నుంచి ఇప్పటి వరకు 88,526 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో ఆరోగ్య సమస్యలతో 11 మంది మరణించారు. ఆగస్టు 11న రక్షా బంధన్‌, శ్రావణ పౌర్ణిమ రోజున అమర్‌నాథ్‌ యాత్ర ముగియనుంది.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ హత్యకు కుట్ర?.. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్‌

మరిన్ని వార్తలు