ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం!

24 Sep, 2022 11:54 IST|Sakshi

లక్నో: భారీ వర్షాలు, వరదలు ఉత్తర్‌ప్రదేశ్‌లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇటావా జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రెండు వేరు వేరు ప్రాంతాల్లో గోడలు కూలిపోయి మొత్తం 10 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటావాతో పాటు ఫిరోజాబాద్‌, బలరాంపుర్‌ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

ఇటావా చంద్రపురా ప్రాంతంలో ఇంటి గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందగా.. క్రిపాల్‌పుర్‌ ప్రాంతంలో పెట్రోల్‌ పంపు ప్రహారీ గోడ కూలి గుడిసెపై పడగా వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో అందావా కే బంగ్లా గ్రామంలో ఇంటి గోడ కూలిపోయి 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇటావా గ్రామంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు

మరిన్ని వార్తలు