మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై... శరద్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు

18 Sep, 2022 11:26 IST|Sakshi

పూణే: లోక్‌సభ, శాసన సభల్లో మహిళల రిజర్వేషన్‌ విషయమై కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే విషయంలో ఉత్తర భారతదేశం సానుకూలంగా లేదని, వాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం పూణే డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో పా‍ల్గొని ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్‌ పవార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభలోనూ అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉండాలని రూపొందించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్టుంది అని శరద్‌ పవర్‌ని మీడియా ప్రశ్నించగా...దీనికి ఆయన సమాధామిస్తూ...తాను కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్‌లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్‌ అన్నారు.

ముఖ్యంగా అందుకు ఉత్తర భారతదేశం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్‌పవార్‌ అన్నారు. అంతేగాదు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ..జిల్లా పరిషిత్‌, పంచాయితీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టానని, మొదట్లో వ్యతిరేకించిన తర్వాత ప్రజలే దానిని ఆమోదించారని చెప్పుకొచ్చారు.  

(చదవండి: యడ్డి తనయుడిపై లోకాయుక్తాలో కేసు)
 

మరిన్ని వార్తలు