అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తుంది: శరద్‌ పవార్‌‌

15 Mar, 2021 09:29 IST|Sakshi

పుణే: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అస్సాంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశానికి కొత్త దిశను నిర్దేశించనున్నాయన్నారు. పుణే జిల్లా బారామతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల తరఫున పోరాడుతున్న మమతా బెనర్జీపై దాడికి బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు.

బెంగాల్‌ ఆత్మగౌరవానికి సంబంధించి ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు యావత్తూ మమతా బెనర్జీ వెంట నడుస్తున్నారని, టీఎంసీకి అధికారం ఖాయమని చెప్పారు. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలపై ముందే మాట్లాడటం తప్పంటూనే ఆయన.. కేరళలో వామపక్షాలతో కలిసి ఎన్‌సీపీ పోటీ చేస్తోందనీ, అక్కడ స్పష్టమైన మెజారిటీ తమకు దక్కుతుందన్నారు. తమిళనాడులో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం అస్సాంలో బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉందనీ, ఆ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందని అన్నారు. 

చదవండి:  బెంగాల్‌ ముఖచిత్రాన్ని ‘సినీలోకం’ మార్చేనా?

మరిన్ని వార్తలు