ఆ వార్తలను నమ్మొద్దు.. ప్రణబ్‌ కోలుకుంటున్నారు

13 Aug, 2020 11:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో వదంతులు వస్తున్నాయి. వాటిని ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ ఖండించారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని తెలిపారు. ఆ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, తమ తండ్రి కోలుకుంటున్నారని ట్విటర్‌లో వెల్లడించారు. సోషల్‌ మీడియాలో తమ తండ్రి అనారోగ్యంపై వచ్చే వార్తలు ఆసత్యమని, ముఖ్యంగా మీడియా గమనించాలని తెలిపారు.

ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్‌–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు